Weather Update : తెలుగు రాష్ట్రాల్లో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. పగటి పూట ఎండలు మండిపోతుంటే రాత్రివేళలో ఉక్కపోత నిద్రపోనివ్వడం లేదు. మరో మూడు రోజులు ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ వెల్లడించింది. తెలంగాణలో మాత్రం నాలుగు రోజుల తర్వాత తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉన్నట్టు చెబుతోంది.
రానున్న ఐదు రోజుల పాటు రాష్ట్రంలో ఎండలు పెరిగే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ప్రజలు బయటకు రావద్దని హెచ్చరించారు. గత కొద్ది రోజులుగా ఎండలు కాస్త చల్లబడినప్పటికీ మే 31 వరకు తీవ్రమైన ఎండలు కొనసాగుతాయని వాతావరణ శాఖ ప్రకటించింది. వాతావరణ కేంద్రం కూడా ఉష్ణోగ్రతలు (Temperatures) 50 డిగ్రీలకు చేరుకునే అవకాశం ఉందని అందరినీ హెచ్చరించింది.
వాతావరణ సూచన మేరకు మే 31 వరకు మరో నెల రోజుల పాటు ఎండలు విపరీతంగా ఉంటాయని, ముఖ్యంగా తెలుగు రాష్టాల్లో ఎండలు ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున రెడ్ అలర్ట్ ప్రకటించినట్లు వాతావరణ శాఖ తెలిపింది. మే 2 నుంచి మే 6 వరకు మొదటి ఐదు రోజులు వరకు రెడ్ అలర్ట్ ప్రకటించింది.
తెలంగాణలో (Telangana) ఉష్ణోగ్రతలు 40 ప్లస్ నమోదు అవుతున్నాయి. ఏ జిల్లా ఉష్ణోగ్రతలు చూసుకున్నా తగ్గేదేలే అన్నట్టు పెరిగిపోతున్నాయి. రాబోయే రెండు మూడు రోజుల్లో 44 డిగ్రీలకుపైబడి ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. అవసరమైతే తప్ప ఎవరూ బయటకు రావద్దని నీడ ప్రాంతాల్లో, గాలి తగిలే ప్రదేశాల్లో ఉండాలని సూచిస్తోంది. ద్రవపదార్థాలు ఎక్కువ తీసుకోవాలని వాతావరణ శాఖ చెబుతోంది.