Rainfall Alert : తెలంగాణాలో మోస్తరు వర్షాలు నుంచి భారీ వర్షాలు, పలు జిల్లాల్లో ఎల్లో అలర్ట్
తెలంగాణాలో పలు జిల్లాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. కొన్ని జిల్లాల్లో యెల్లో అలర్ట్ వచ్చింది.
Rainfall Alert : సాధారణంగా మేలో ఎండలు బాగా కొడతాయి. అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. రోహిణి కార్తె రాళ్లను పగిలేలా ఎండలు కొడతాయి అని పల్లె ప్రజల ఎక్కువగా నమ్ముతారు. కానీ ఈసారి మాత్రం మే నెలలో వర్షాలు బాగా పడుతున్నాయి. ఏప్రిల్ చివరి వారం, మే మొదటి వారంలో ఎండలు ఎక్కువగా నమోదయ్యాయి.
ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 47 డిగ్రీలకు పైగా పెరిగాయి. వడదెబ్బ తగిలి పదుల సంఖ్యలో చనిపోయారు.ఆ తర్వాత, గత పది రోజులుగా తెలంగాణలో వాతావరణం చల్లబడింది. వర్షం బాగా కురుస్తోంది. రోజూ వర్షం పడుతోంది.
హైదరాబాద్లోనూ శనివారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. దీంతో, నీళ్లు అధికంగా చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మరి కొన్ని జిల్లాల్లో వర్షాలు బాగా కురిశాయి.
గత కొన్ని రోజులుగా తెలంగాణలో చల్లటి వాతావరణం నెలకొంది. హైదరాబాద్ వాతావరణ కేంద్రం (Hyderabad Meteorological Centre) తాజాగా మరోసారి హెచ్చరిక జారీ చేసింది. నేడు కూడా రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేశారు. కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపారు.
భారీ వర్షాల నేపథ్యంలో పలు జిల్లాల్లో ఎల్లో అలర్ట్ (Yellow alert) ప్రకటించారు. జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, రంగారెడ్డి, నాగర్కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాల, జనగామ, యాదాద్రి భువనగిరి, వరంగల్, హనుమకొండ, నారాయణపేట, మంచిర్యాల జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయని వెల్లడించారు.
హైదరాబాద్లోనూ ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. ఉదయం ఎండగా ఉన్నప్పటికీ సాయంత్రం వర్షం కురిసే అవకాశాలు ఉన్నాయి. కాగా, నైరుతి రుతుపవనాలు మరో 36 గంటల్లో అండమాన్ నికోబార్ దీవులతో పాటు ఆగ్నేయ బంగాళాఖాతంలోకి చేరుకుంటాయని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు.
Comments are closed.