Telugu Mirror: ముఖ్యమంత్రి కేసీఆర్ కొద్ది రోజుల క్రితం దివ్యాంగుల (Handicap) పింఛన్లను రూ. 4,016 కు పెంచుతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే తెలంగాణా ప్రభుత్వం (TelanganaGovernment) ఇవాళ దీనిని అధికారికంగా ప్రారంభించనుంది. ఈ రోజు మెదక్ లో జరిగే సభలో ముఖ్యమంత్రి దివ్యాంగులకు రూ. 4,016 పింఛన్లను పంపిణీ చేయనున్నారు. పింఛన్ల పెంపుతో రాష్ట్రంలో ఉన్న 5.5 లక్షల మంది దివ్యాంగులకు లబ్ధి చేకూరనుంది. పెరిగిన పింఛన్లు ఈ నెల నుంచే వీరందరికీ అందనున్నాయి
ఉమ్మడి రాష్ట్రంలో 2014 కు ముందు దివ్యాంగుల పింఛను రూ. 500 గా ఉండేది.అయితే తెలంగాణ రాష్ట్రం (Telangana State) ఏర్పాటై ముఖ్యమంత్రిగా కేసీఆర్ (KCR) బాధ్యతలు చేపట్టిన తర్వాత దివ్యాంగుల పింఛను రూ. 1,500 కు పెంచారు. తిరిగి 2018 లో రాష్ట్రంలో కేసిఆర్ రెండోసారి అధికారం చేపట్టిన తరువాత పింఛన్ ను ఏకంగా డబుల్ చేసి రూ. 3,016 కు పెంచారు. ఈ సంవత్సరం జూన్ లో మంచిర్యాలలో జరిగిన సభలో సీఎం కేసిఆర్ తన ప్రసంగంలో దివ్యాంగుల పింఛనును రూ. 4,016 కు పెంచనున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. జులై నెల నుంచి పెంచిన పథకం అమల్లోకి వస్తుందన్నారు. ఈరోజు మెదక్ (Medak) సభలో అధికారికంగా పెరిగిన పింఛను ప్రారంభించడం ద్వారా దివ్యాంగులకు రూ. 4,016 పింఛనును అంద జేయనున్నారు.
ఇకపోతే దేశంలోనే తొలిసారి బీడీ టేకేదారులకు కూడా పింఛను ప్రకటించింది ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వ్యంలోని తెలంగాణ ప్రభుత్వం (Telangana Government). బీడీ టేకేదార్ లకు కూడా కేసిఆర్ ప్రభుత్వం ప్రతి నెల రూ. 2,016 పింఛన్ రూపంలో అందించనుంది. ఈ పథకాన్ని కూడా సీఎం కేసీఆర్ ఈ రోజు ప్రారంభిస్తారు. ఈ పింఛను వలన రాష్ట్రంలోని 7,254 మంది బీడీ టేకేదారులు లబ్ధి పొందనున్నారు. భారత దేశంలోని 16 రాష్ట్రాల్లో బీడీ కార్మికులు ఉన్నప్పటికీ ఏ రాష్ట్రంలో కూడా బీడీ టేకేదార్ లకు ఎటువంటి పథకాన్ని రూపొందించలేదు. దేశంలోనే తొలిసారి తెలంగాణా రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం టేకేదారులకు కూడా పింఛను పథకాన్ని ప్రారంభిస్తోంది.
తెలంగాణా రాష్ట్రంలో ఆసరా పథకం అమలు చేయడం ద్వారా వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలకు మరియు దివ్యాంగులకు కేసీఆర్ ప్రభుత్వం ప్రతి నెలా ఫించ్లను అందించి ఆదుకుంటుంది. వృద్దులు, వితంతువులకు నెల నెలా రూ. 2,016 పింఛను అందుతోంది. అయితే దివ్యాంగులకు ఇకనుంచి ప్రతినెలా రూ. 4,016 పింఛను ఇవ్వనుంది ప్రభుత్వం. దేశంలోని ఏ రాష్ట్రంలో కూడా దివ్యాంగులకు ఇంత మొత్తంలో పింఛనును అందించడం లేదు.
ఇదిలా ఉండగా తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు (Assembly Elections) సమీపిస్తున్న విషయం తెలిసిందే. రెండు రోజుల క్రితం సీఎం కేసీఆర్ తమ పార్టీ తరఫున 115 నియోజకవర్గాలకు పోటీచేసే అభ్యర్థులను కూడా ప్రకటించారు. మిగతా నియోజక వర్గాల అభ్యర్థులను కూడా త్వరలోనే ప్రకటిస్తారు. పార్టీ మేనిఫెస్టోను కూడా అతి త్వరలోనే విడుదల చేస్తామన్నారు. ఎన్నికల మేనిఫెస్టో లో ఇంకా కొత్త సంక్షేమ పథకాలు కూడా ఉంటాయన్నారు. అయితే ఎన్నికలకు ముందే తెలంగాణలో యువతకు నిరుద్యోగ భృతి ఇస్తారనే వార్తలు వస్తున్నాయి కానీ దీనిపై ప్రభుత్వం నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన విడుదల కాలేదు.